జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన మద్దిలేటి సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం... పెద్ద కుమారుడు నందును కొత్తకోట జీటీ నారాయణ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. 2016 ఏప్రిల్ 7న మీ అబ్బాయి కనబడటం లేదని కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్ చేశారు. యాజమాన్యాన్ని అడిగితే... నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఏం చేయాలో తోచక... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. కలెక్టర్, ఎస్పీని కూడా వేడుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కానీ నాలుగేళ్ల తర్వాత కన్న కొడుకు వెతుక్కుంటూ వస్తే.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు.
ఇన్ని రోజులు ఎక్కడున్నావని ఆ బాలుడిని ఆరా తీయగా... పాఠశాల బయట ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ముఖానికి చేతులు అడ్డుపెట్టి ఎక్కడికో తీసుకెళ్లినట్టు చెప్పాడు. మెలుకువ వచ్చి చూసే సరికి ఓ గదిలో ఉన్నట్టు చెప్పాడు. ఇలా రెండు రోజుల తర్వాత పళ్లెం ఇచ్చి... రోజు రెండు వందలు రూపాయలు అడుక్కొని రావాలని, లేదంటే... కొడతామని బెదిరించినట్టు తెలిపాడు. రెండు సార్లు పారిపోవడానికి ప్రయత్నిస్తే... తీవ్రంగా కొట్టినట్టు చెప్పాడు. ఇన్ని రోజులు అనంతపురంలో భిక్షాటన చేసినట్టు నందు వివరించాడు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి కోరుతున్నాడు.
ఇదీ చూడండి: ఆలమట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి: వంశీచంద్ రెడ్డి