భువనగిరి బస్టాండ్లో గత సోమవారం మూడేళ్ల పాపను కిడ్నాప్ చేసిన నిందితులను పట్టుకున్నట్లు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండకి చెందిన లకావత్ భిక్షపతికి పిల్లలు లేరు. ఎవరైనా పిల్లలంటే చెప్పమని తన బావమరిది బాలుని కోరాడు. బాలు ఆ విషయం అతని బంధువు శ్రీనుకు చెప్పగా... ఇద్దరూ కలిసి కిడ్నాప్ సూత్రధారి మరపాక బాబుని కలిశారు. పాపను కిడ్నాప్ చేయటం కోసం బాబు, తన బావమరిది రాజును వెంటబెట్టుకొని హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్కి వెళ్లారు.
అక్కడ మహబూబ్నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన మహేశ్వరి... తన భర్తను వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్కు చేరుకుంది. ఆమెను గమనించిన కిడ్నాపర్లు... మహేశ్వరితో మాటలు కలిపి... ఆమె భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయ మాటలు చెప్పి గజ్వేల్ తీసుకెళ్లారు.
గజ్వేల్లో రాజు భార్య ఆనందమ్మ కలిసి... బాధితురాలు మహేశ్వరిని, ఆమె కూతురిని భువనగిరికి తీసుకెళ్లింది. అక్కడ మహేశ్వరిని మాటల్లో పెట్టి... నిందితులు ముగ్గురు మూడేళ్ళ బాలికను కిడ్నాప్ చేశారు. మహేశ్వరి పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపి భువనగిరి పట్టణ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు మరపాక బాబు పరారీలో ఉన్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: తల్లికి మాయమాటలు చెప్పి కూతుర్ని కిడ్నాప్ చేశారు..