అఫ్గానిస్థాన్ తూర్పు నంగార్హర్ ప్రాంతంలోని ఓ స్టేడియంలో వీసాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగి 11మంది మృతి చెందారు. సాకర్ స్టేడియంలో జరిగిన ఈ ఘటన వివరాలను ప్రభుత్వ అధికారి అతుల్లా ఖోగ్యాని వెల్లడించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులని ధృవీకరించారు. గాయపడ్డ వారిలో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు. వీరంతా పాకిస్థాన్కు వెళ్లేందుకు వీసాల కోసం వచ్చినట్లు వివరించారు.
నంగార్హర్లో ఉన్న పాకిస్థాన్ కాన్సులేట్ కరోనా దృష్ట్యా మూసివేశారు. ఇటీవల తెరుచుకోవటంతో భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిపారు. గత వారం 19వేల వీసాలు జారీ చేసినట్లు వివరించారు. అఫ్గాన్లో వరుస దాడులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక మంది పాకిస్థాన్కు పయనమవుతున్నారని వెల్లడించారు.
మరో ఘటన..
ఉత్తర అఫ్గాన్లో తాలిబన్లు జరిపిన ఆకస్మిక దాడిలో 34మంది అఫ్గాన్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8మందికి గాయాలైనట్లు థాకర్ ప్రావిన్స్ వైద్యాధికారి రహీమ్ బకిష్ డానిష్ వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి జావద్ హిజ్రీ తెలిపారు.
ఓవైపు తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం నెల రోజుల నుంచి శాంతి చర్చలు జరుపుతున్నా తాలిబన్లు దాడికి యత్నించారని అధికారులు తెలిపారు.
తాలిబన్లు ఒక కాన్వాయ్లో వచ్చి దాడికి పాల్పడినట్లు అఫ్గాన్ భద్రతాధికారి తెలిపారు. అనేక పోలీస్ స్థావరాలకు నిప్పుపెట్టారని వివరించారు. అయితే దాడికి సంబంధించి తాలిబన్లు ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.