పాలస్తీనాలోని గాజాపై బుధవారం మరోమారు వైమానిక దాడులు చేపట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఆరుగురు మరణించారు. బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా రాకెట్ దాడులను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది.
బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చేసే ముందు హెచ్చరిక క్షిపణి ఆ భవనాన్ని తాకిందని అనంతరం ఐదు నిమిషాల్లోనే భవనాన్ని క్షిపణి కూల్చేసిందని అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లోని ఉగ్రవాద లక్ష్యాలను క్షిపణి తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. 25 నిమిషాల వ్యవధిలో 52 విమానాలు 40 లక్ష్యాలపై క్షిపణునులు ప్రయోగించాయని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ దాడిలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని పేర్కొంది.
219 మంది మృతి..
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ అనుచరుడు మరణించినట్లు హమాస్ ఉగ్ర సంస్థ తెలిపింది. వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 219 మంది పాలస్తీనియన్లు మరణించారని ఇందులో 63 మంది చిన్నారులు, 36 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 18 ఆస్పత్రులు దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి : అమెరికా- రష్యా విదేశాంగ మంత్రుల తొలి భేటీ