2015 అణు ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. యురేనియం ఉత్పత్తిని ప్రారంభించింది ఇరాన్. ఈ విషయాన్ని ఐరాసకు చెందిన ఇంటర్నెషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ప్రకటించింది.
3.6 గ్రాముల యురేనియం.. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్లాంటులో ఉత్పత్తి అయినట్టు ఐరాస సభ్య దేశాలకు వెల్లడించారు ఐఏఈఏ అధిపతి రఫేల్ గ్రాస్సి. తమ అధికారులు ఈ విషయాన్ని ఈ నెల 8న ధ్రువీకరించినట్టు పేర్కొన్నారు.
ఒప్పందానికి తూట్లు..
యురేనియంపై పరిశోధనలు చేయబోమని 2015లో అణు ఒప్పందంపై సంతకం చేసింది ఇరాన్. అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఈ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగస్వాములుగా ఉన్నాయి. అణుబాంబు తయారీలో దీనిని ఉపయోగించే అవకాశం ఉండటం వల్లే.. ఇరాన్ చర్యలను నిషేధించడానికి ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించాయి ప్రపంచ దేశాలు.
అయితే 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. అదే సమయంలో ఇరాన్పై భారీ స్థాయిలో ఆంక్షలు విధించింది. ఆ దెబ్బకు ఇరాన్ అతలాకుతలమైంది.
ఈ నేపథ్యంలో అమెరికా లేనప్పటికీ.. ఒప్పందం విషయంలో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఇతర దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఒప్పందాన్ని ఇరాన్ ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే ఉంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విధంగా తమకు సహాయం చేస్తేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని తేల్చిచెప్పింది.
అయితే అణు ఒప్పందంలో తిరిగి చేరేందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ తరుణంలో యూరేనియం ఉత్పత్తికి సంబంధించిన వార్త బయటకు రావడం.. ఒప్పందంపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: న్యూజిలాండ్, ఇండోనేసియాల్లో భూకంపాలు