ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో గాజాలోని హమాస్ ఉగ్రవాద అగ్రనేత ఖలీల్ అల్ హయెహ్ ఇంటిపై బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఆ ఇల్లు ఉపయోగపడుతోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్ ఫోన్
అంతకుముందు గాజా నగరంలోని మీడియా భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. గాజాలోని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు గట్టి మద్దతు తెలిపిన బైడెన్.. గాజాలోని అమాయక ప్రజల మరణాలు, పాత్రికేయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జరుగుతున్న ఘర్షణలకు ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యల గురించి బైడెన్కు వివరించారు నెతన్యాహు. తమకు మద్దతుగా ఉన్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని.
బైడెన్కు పాలస్తీనా అధ్యక్షుడు ఫోన్
బైడెన్తో పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులకు స్వస్తి పలికేలా చర్చలు జరపాలని బైడెన్కు విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో శాంతి కోసం అంతర్జాతీయ మధ్యవర్తులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
విరమించండి
హమాస్ ఉన్నతాధికారి ఇస్మాయిల్ హనియా.. ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ను దాహోలో కలిసినట్లు ఖతార్ విదేశాంగశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు హమాస్ నేత. మరోవైపు దాడులు విరమించుకోవాలని ఇరు వర్గాలకు ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలు విజ్ఞప్తి చేశాయి.
ఇదీ చూడండి: గాజాలోని మీడియా భవనంపై ఇజ్రాయెల్ దాడి