యెమెన్ రాజధాని సనాకు తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ మారిబ్లోని సైనిక శిబిరంపై శనివారం క్షిపణి, డ్రోను దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక శిబిరం మసీదుకు దగ్గరగా ఉండటం, అందులోనూ ప్రార్థనల సమయంలో దాడి చేయడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సైన్యాధికారులు తెలిపారు.
కొద్ది నెలలుగా యెమెన్లో ఇరాన్ మద్దతుతో హుతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. సౌదీ అరేబియా సైన్యం సాయంతో స్థానిక ప్రభుత్వం ఆందోళనకారులను అణిచివేస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం సైనిక శిబిరంపై జరిగిన దాడి హుతీ తిరుగుబాటుదారులే చేసి ఉంటారని మిలటరీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే హుతీ మిలీషియా వర్గం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
దాడికి ఒకరోజు ముందు..
ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందు ఉత్తర నిహిమ్ ప్రాంతంలో హుతీలను అణిచివేసేందుకు యెమెన్ ప్రభుత్వం సంకీర్ణ బలగాలను ఉపయోగించింది. ఈ సందర్భంగా డజన్ల కొద్ది హుతీ మిలీషియా సభ్యులు చనిపోయారు. ఆ ఘటన జరిగిన తర్వాత రోజే క్షిపణులను ప్రయోగించడం గమనార్హం.
డ్రోన్ దాడిని యెమెన్ అధ్యక్షుడు అబేద్రాబ్బో మన్సూర్ తీవ్రంగా ఖండించారు.
" ఇది తప్పకుండా హుతీ తిరుగుబాటుదారుల పనే. విధ్వంసం తప్ప వారికి ఏమీ తెలియదు. హుతీ మిలీషియా సభ్యులు ఇరాన్ చేతిలో కీలుబొమ్మలు."
అబేద్రాబ్బో మన్సూర్, యెమెన్ అధ్యక్షుడు