భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ సమీక్ష నిర్వహించారు. కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు సహా కీలక రంగాలపై సమీక్ష జరిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిణామాలపైనా ఇరువురు చర్చించారు. ఇండోనేసియాలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భేటీ అయిన ఇరువురు దేశాధినేతలు... రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
![PM Modi US President Biden meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16936338_biden-modi-4.jpg)
![PM Modi US President Biden meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16936338_biden-modi-3.jpg)
భారత్, అమెరికా భాగస్వామ్యం బలోపేతం అయ్యేందుకు బైడెన్ చేస్తున్న నిరంత కృషికి మోదీ కృతజ్ఞతలు చెప్పారని విదేశాంగ శాఖ పేర్కొంది. 'జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించే సమయంలోనూ ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్వాడ్, ఐ2యూ2 కూటముల సహకారంపై ఇరుదేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు' అని విదేశాంగ శాఖ వివరించింది.
![PM Modi US President Biden meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16936338_biden-modi-2.jpg)
![PM Modi US President Biden meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16936338_biden-modi-1.jpg)
రిషి, మోదీ సంభాషణ
బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్నూ మోదీ కలిశారు. సమావేశాల్లో భాగంగా ఇరువురూ కాసేపు ముచ్చటించారు. సునాక్తో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
![PM Modi Rishi sunak meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16936338_fhmcj_2vuae41hf.jpg)
మరోవైపు, ఇండోనేసియాలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2014కు ముందు, తర్వాత భారత్లో భారీ మార్పు సంభవించిందని చెప్పుకొచ్చారు. ఊహించని వేగంతో భారత్ ముందుకెళ్తోందని చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థ భారతేనని గుర్తు చేశారు. 21వ శతాబ్దానికి భారత్ ఆశాకిరణంగా మారిందని చెప్పారు.
"ఇకపై చిన్న కలలు కనడం ఉండదు. 2014 తర్వాత 32 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచాం. ఇది అమెరికా జనాభా కంటే అధికం. దేశంలోని ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమలకు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలకు భారత సంతతి వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు" అని చెప్పారు మోదీ. భారత్ కంటే రెండేళ్ల ముందే ఇండోనేసియాకు స్వాతంత్ర్యం రావడం వారి అదృష్టమని, ఇండోనేసియా నుంచి చాలా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.