జులై నెలాఖరికి వయెజనులందరికీ టీకా పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని ఇంకా కొన్ని రోజులు మిగిలుండగానే సాధించినట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జులై 19 నాటికి పెద్దలందరికీ టీకా అందించాలని.. అలాగే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రెండు డోసులు వేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనిని ముందే సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా.. "ఎనిమిది నెలలుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో మైలు రాయిని చేరుకున్నాం" అని బోరిస్ తెలిపారు.
ఇప్పటివరకు 87.8శాతం మందికి టీకా తొలి డోసు అందించగా.. 67.8శాతం మందికి రెండు డోసులు వేసినట్లు ఆ దేశ ఆరోగ్య, సామాజిక సంక్షేమ విభాగం(డీహెచ్ఎస్సీ) తెలిపింది.
వియత్నంలో పాక్షిక లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే కొన్నిదేశాలు పాక్షిక లాక్డౌన్ అమలు చేయగ.. తాజాగా వియత్నాం కూడా ఈ జాబితాలో చేరింది. దేశంలోని దక్షిణాది ప్రాంతంలో రెండు వారాలు లాక్డౌన్ విధించింది. ఆ ప్రాంతంలో వరుసగా మూడోరోజు.. 3,000 కంటే ఎక్కువ కేసులు నమోదైన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 19 కోట్ల 9 లక్షల 69 లక్షలకు దాటింది. ఇప్పవరకు 41 లక్షల మంది కొవిడ్తో మృతి చెందారు. కాగా 17 కోట్ల 39 లక్షల 62 వేలమందికిపైగా కోలుకున్నారు. బ్రిటన్, అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా సహా పలు దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది.
ఇదీ చూడండి: 'ఐసోలేషన్'పై ఆ దేశ ప్రధాని యూటర్న్.. ఎందుకంటే?