ర్యాప్ సింగర్ పాబ్లో హాసెల్ అరెస్టును నిరసిస్తూ... వరుసగా నాలుగు రోజుల నుంచి స్పెయిన్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. కాటలోనియా, బార్సిలోనా సహా మూడు ఇతర ప్రధాన నగరాల్లో నిరసనకారులు అందోళనలు చేస్తూ హింసకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికారులపై రాళ్లు రువ్వడం, బాటిళ్లు విసరడం వంటివి చేస్తూ వాహనాలకు నిప్పంటిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు... కంటైనర్లను తగలబెడుతూ వీధులను దిగ్బంధించారు. బార్సిలోనాలో కొందరు బ్యాంకుల్లోకి చొరబడి నిప్పంటించేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. గిరోనా, కాటలాన్ సిటీలో నిరసనకారులు మూడు బ్యాంకుల కిటికీలను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు.
వేల సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొంటున్నారు. అయితే... హింసకు పాల్పడడం సరికాదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యలు చేసిన అనంతంరం... కొందరు నిరసనకారులు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేశారు. కొద్దిరోజుల క్రితం ర్యాప్ సింగర్ హాసెల్.. అక్కడి రాచరికాన్ని ప్రశ్నించడం సహా ఉగ్రవాదాన్ని కీర్తించారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:'శాంతియుత నిరసన నిర్వివాదాంశమైన హక్కు'