నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య మొదలైన వివాదం తీవ్రమవుతోంది. సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ ఘర్షణ.. యుద్ధం పరిస్థితులను లేవనెత్తింది. అయితే శనివారం నాటికి ఈ ప్రాంతం మరింత రణరంగంగా మారింది.
ఓ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాం
నాగోర్నో- కరాబాఖ్పై పట్టుకోసం ప్రయత్నిస్తోన్న చర్యలో భాగంగా.. తమ సైన్యం వివాదాస్పద ప్రాంతంలోని మడగిజ్ గ్రామాన్ని స్వాధీనం చేసుకుందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియెవ్ శనివారం వెల్లడించారు.
3 విమానాలు కూల్చేశాం
శనివారం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. అజర్బైజాన్కి చెందిన మూడు విమానాలను ధ్వంసం చేశామని ఆర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుశాంత్ స్టెపానియన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన అజర్బైజాన్ రక్షణ శాఖ.. ఆర్మేనియా మాటల్లో వాస్తవం లేదని పేర్కొంది.
150 మంది మృతి!
ఇటీవలె జరిగిన ఘర్షణలో తమ బలగాల్లోని 150 మంది మృతి చెందారని నాగోర్నో-కరాబాఖ్ అధికారులు వెల్లడించారు. అజర్బైజాన్ సైన్యంలో 19 మంది మృతి చెందగా, 55 మంది గాయాలపాలయ్యారని ఆ దేశ రక్షణ శాఖ పేర్కొందని అధికారులు తెలిపారు.
నిఘా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అజర్బైజాన్కు చెందిన 3000 మంది సైనికులు ఉద్రిక్తతలో మరణించారని నాగోర్నో-కరాబాఖ్ అధికార ప్రతినిధి వాహ్రన్ పోఘోస్యాన్ ఫోస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, వివరాలను వెల్లడించలేదు.
అసలు గొడవేంటి?
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు 1991లో నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్బైజన్ నియంత్రణలో ఉండేది. అయితే అనంతర కాలంలో ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం లభించింది. 1992లో ఈ ప్రాంతం కోసం ఆర్మేనియా-అజర్బైజాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో దాదాపు 30,000 మంది ప్రజలు చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి ఆర్మేనియా వివాదస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్ను కూడా ఆక్రమించింది.
శనివారం జరిగిన ఘర్షణలో.. ఈ ప్రాంతాన్నే తాము తిరిగి స్వాధీనం చేసుకున్నామని అజర్బైజాన్ వెల్లడించింది.
వివాదాస్పద ప్రాంతంలో తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పలుమార్లు హెచ్చరించినా.. ఇరు దేశాలు అవి పెడచెవినపెట్టాయి. మరోవైపు, అజర్బైజాన్కు మద్ధతుగా టర్కీ సైన్యం నిలుస్తోందని ఆర్మేనియా తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఇరువురూ కలిసి ఆర్మేనియాను ఆక్రమించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించింది.