అఫ్గానిస్థాన్లోని ఘజినీ రాష్ట్రంలో విమానం కుప్పకూలిన ఘటనపై అమెరికా సైన్యాధికారులు దర్యాప్తు చేపట్టారు. తాలిబన్ల స్థావరాలకు సమీపంలో ఈ ఘటన జరగడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఉగ్రవాదుల పనేనా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.
అమెరికా సైన్యంతో వెళ్తున్న విమానం తూర్పు అఫ్గానిస్థాన్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పకూలింది. సమాచారం అందుకున్న అఫ్గానిస్థాన్ సైన్యం.. సహాయక చర్యలు చేపట్టింది.
భారీ సంఖ్యలో మృతులు?
విమానం కాలిపోతుండటం తాను చూసినట్టు ఓ స్థానిక జర్నలిస్టు తెలిపాడు. ఘటనలో విమాన ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాలిబన్లపై పలు ఆరోపణలు చేశారు. ఘటనా స్థలంలో తాలిబన్లను భారీగా మోహరించారని తెలిపాడు. ప్రమాదం నుంచి ఇద్దరు తప్పించుకున్నట్టు వెల్లడించిన జర్నిలిస్టు... వారిని చంపేందుకు పరిసర గ్రామాల్లో ఉగ్రవాదులు కూంబింగ్ చేపట్టినట్టు తెలిపాడు.
ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
బాధ్యులు ఎవరో..?
ఈ ఘటనపై స్పందించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. విమానం అమెరికాకు చెందినదిగా గుర్తించడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
అయితే ఘటనాస్థలం నుంచి తీసిన చిత్రాల్లో కుప్పకూలిన విమానం.. అమెరికా సైన్యానికి చెందిన ఈ-11ఏగా స్పష్టమవుతోందన్నారు .
ఇదీ చూడండి: అఫ్గానిస్థాన్లో విమాన ప్రమాదం- పలువురు మృతి!