బాస్మతి బియ్యం భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం ఐరోపా సమాఖ్యకు దరఖాస్తు చేసుకుంది భారత్. భారత ఉపఖండంలో పండే పొడువైన బాస్మతి బియ్యం సుగంధ భరితమైనవని. ఇవి భారత ఉప ఖండంలోని ప్రత్యేక భౌగోళిక ప్రాంతమైన హిమాలయాల పర్వతాల కింద సింధూ-గంగా మైదాన భూభాగంలో ఎక్కువగా పండుతాయని దరఖాస్తులో పేర్కొంది భారత్.
ప్రత్యేకమైన బాస్మతి బియ్యం... పంజాబ్, హరియాణా, దిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోని అన్ని జిల్లాల్లోనూ, ఉత్తర్ప్రదేశ్, జమ్ముకశ్మీర్లోని కొన్నిజిల్లాల్లో పండుతాయని నివేదించింది భారత్.
పాక్ కుట్రలు
ఒకవేళ భారత్ బాస్మతి బియ్యానికి జీఐ లభించినట్లయితే, తమ దేశ బియ్యం ఎగుమతులు దెబ్బతింటాయని భావించిన పాక్... ఈయూలో భారత్ దరఖాస్తును వ్యతిరేకించాలని కుట్ర పన్నుతోంది. ఈ మేరకు ఆ దేశంలోని ప్రముఖ బియ్యం ఎగుమతుదారులు భారత్ దరఖాస్తును తక్షణమే వ్యతిరేకించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే దేశంలోని బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశ బియ్యం ఎగుమతి అసోసియేషన్ అధికారి తారిక్ అహ్మద్.
భారత్ పేరు మీదే అమ్ముకోవాలి!
ఏళ్ల తరబడి నానుతున్న ఈ సమస్యను పాక్ పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి అధికారులు. తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే భారత్ పేరుమీదే బియ్యం అమ్ముకోవాల్సి వస్తుందన్నారు తారిక్.
వ్యతిరేకిస్తాం...
బాస్మతి బియ్యం... ఈయూలో పాక్, భారత్ రెండు దేశాలకూ చెందినవిగా గుర్తింపు పొందాయి. కానీ భారత్ మాత్రమే బాస్మతి బియ్యంపై ప్రత్యేక హక్కులు పొందడం చట్ట విరుద్ధమని పాక్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఆరోపించింది. దురదృష్టవశాత్తూ హిమాలయాల ఉప్పు, ముల్తాన్ మట్టి భారత్ పేరుమీదగానే అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతున్నాయని వ్యాఖ్యలు చేసింది. ఈ దరఖాస్తును తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని పేర్కొంది.
ఇదీ చూడండి: 'సింధు జలాల ఒప్పందం' గురించి తెలుసుకోవాల్సినవి