చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్ నుంచి దుబాయ్కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
![Indian national infected with coronavirus in UAE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6038178_japanssss_1.jpg)
జపాన్ నౌకలో పరిస్థితి..
మరోవైపు జపాన్ విహార నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’లో ఉన్న భారతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నౌకలో ఉన్న 138 మంది భారతీయుల్ని బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నౌకలో పరిస్థితుల్ని నిశితంగా పరిశీస్తున్నామని.. అక్కడి అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నౌకలో 64 మందికి వైరస్ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే.
ఇదీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 43వేలు దాటిన కరోనా బాధితులు