దేశాల మధ్య చర్చలు మూడో పక్ష ప్రయోజనాలు దెబ్బతీసే ఉద్దేశంతో జరగరాదని అన్నారు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్. ప్రతిగా పరస్పర అవగాహన పెంపునకు జరగాలని చెప్పారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా (క్వాడ్) కూటమి శుక్రవారం వర్చువల్గా సమావేశం కానున్న నేపథ్యంలో లిజియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశాల మధ్య చర్చలు, సహకారం.. మూడో వ్యక్తుల(దేశాల) ఆశయాలను దెబ్బతీయడానికి కాక పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు జరగాలి. ఒక దేశాన్ని నష్ట పరిచేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయరాదు. సంబంధిత దేశాలు(క్వాడ్).. పారదర్శకత, సమ్మిళిత, ఇరువురికీ లాభం అనే సూత్రాలను పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధన కోసం చర్చలు జరగాలి."
- ఝావో లిజియన్, చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి
క్వాడ్ సదస్సులో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు, ఆ దేశ సైనిక, ఆర్థిక శక్తి దుర్వినియోగాన్ని కట్టడి చేసే అంశంపైనా దేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసం వ్యూహాత్మక ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి: విస్తరించనున్న చతురస్రం- చైనాను ఎదుర్కొనే వ్యూహమదే