చైనాలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన హుబే రాష్ట్రంలో పౌరులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అసలు ఏమైంది?
కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా జనవరి 23 నుంచి హుబే రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది. వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇటీవల ఆంక్షలు ఎత్తివేశారు. అనేక రోజులుగా హుబేకే పరిమితం అయిన ప్రజలు... ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న జియాంగ్షీ రాష్ట్రానికి అనేక మంది ప్రయాణమయ్యారు. అయితే రెండు రాష్ట్రాల్ని కలిపే వంతెనపై జియాంగ్షీ రాష్ట్ర పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఇతరుల తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు.
అడ్డగింతతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు... జియాంగ్షీ పోలీసులతో ఘర్షణ పడ్డారు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. ఓ దశలో హుబే, జియాంగ్షీ రాష్ట్రాల పోలీసులు కూడా పరస్పరం ఘర్షణ పడ్డారు. జియాంగ్షీలోకి ఎవరిని పంపించాలి? అనుమతి పత్రాలు ఎవరు సరిచూడాలన్న అంశంపై వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరస్ అయ్యాయి.
కాసేపటి తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. బారికేడ్లు తొలగించి, ప్రజలు వెళ్లేందుకు అనుతిస్తున్నట్లు స్పష్టంచేశాయి.
ఇదీ చూడండి : ఈ ఏడాది 'ఎర్త్ అవర్' పాటించింది ఆ ఒక్క దేశమే!