సాయుధ దళాల నిర్వహణ పద్ధతులను, శిక్షణ, నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని ఆదేశించారు. సైనిక దళాలకు స్వయంగా నాయకత్వం వహిస్తున్న జిన్పింగ్... టెలికాన్ఫరెన్స్ ద్వారా సైన్యానికి ఈ కీలక సూచనలు చేశారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికాతో విబేధాలు, తూర్పు లద్దాక్లో భారత్తో ఘర్షణ, వ్యూహాత్మక దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో ప్రాదేశిక వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో... జిన్పింగ్ సైనిక ఆధునికీకరణపై దృష్టి కేంద్రీకరించారు.
యుద్ధోన్మాదం
దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి ఫలితాలపై దృష్టి సారించి.. సాయుధ దళాలను నవీకరించాలని, వ్యూహాత్మక వ్యవస్థలు, యంత్రాంగాల్ని మెరుగుపరచాలని 'పీఎల్ఏ'ను జిన్పింగ్ ఆదేశించారు. ఇందుకోసం 13వ పంచవర్ష ప్రణాళికను పూర్తిగా అమలు చేయాలని, అలాగే సైనిక అభివృద్ధి కోసం 14వ పంచవర్ష ప్రణాళికలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ ఏడాది చైనా 1.27 ట్రిలియన్ యువాన్ల(సుమారు 179 బిలియన్ డాలర్లు) భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించింది. గతేడాది ఈ రక్షణ బడ్జెట్ 177.61 బిలియన్లుగా ఉంది.
2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్పింగ్ ... సైనిక దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానంగా దృష్టి సారించారు. రక్షణ దళాలను పునర్వ్యవస్థీకరించారు. నౌకా, వాయు దళాల సామర్థ్యాన్ని బాగా పెంచారు.
ఇదీ చూడండి: గల్వాన్ నదిపై ఆనకట్టా.. మాకు తెలియదే: చైనా