భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక ప్రతినిధుల సమావేశం నేడు దిల్లీలో జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ చర్చలు జరపనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్లో మామల్లపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) నుంచి భారత్ వైదొలిగింది. వీటి తరువాత భారత్- చైనా మధ్య జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. మోదీ-జిన్పింగ్ మధ్య జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలును ఇవాళ ఇరుపక్షాలు సమీక్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'భారత్-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'
అప్పుడు వాయిదా
ఈ సెప్టెంబర్లోనే సరిహద్దు సమస్యల చర్చల కోసం వాంగ్ భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాలు ఇప్పటికే 20 రౌండ్లపాటు చర్చలు జరిపాయి.
సరిహద్దు వివాదం
భారత్-చైనాల మధ్య 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్ దానిని ఖండిస్తోంది. ఇదే ఇరుదేశాల మధ్య ఉన్న వివాదం. అయితే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని ఇరుదేశాలు భావిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'భారత్-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'