లాక్డౌన్ వంటి కఠిన చర్యల అమలు ద్వారా 7 లక్షల మందికిపైగా కరోనా సోకకుండా చైనా ప్రభుత్వం అడ్డుకోగలిగిందని ఓ అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్కు చెందిన పరిశోధకులు ఇందుకు సంబంధించిన నివేదికను చైనా, అమెరికా బ్రిటన్లోని జర్నల్స్లో ప్రచురించారు.
కరోనా మహమ్మారి పుట్టి 50 రోజులైనప్పటికీ ఫిబ్రవరి 19 నాటికి కేసుల సంఖ్య 30,000వేలుగా ఉందని పరిశోధకులు తెలిపారు. వుహాన్లో లాక్డౌన్, ప్రయాణాల నిషేధం వంటి ఆంక్షలను విధించకపోయి ఉంటే 7 లక్షల కొత్త కేసులు నమోదై ఉండేవని అంచనా వేశారు. చైనా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలొచ్చాయని విశ్లేషించారు.
కేసుల నివేదికలు, ప్రజారోగ్య వివరాలు, మొబైల్ ఫోన్ లొకేషన్ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం జరిపారు పరిశోధకులు. చైనా అతిపెద్ద పండగలైన స్ప్రింగ్ ఫెస్టివల్, లూనార్ న్యూ ఇయర్ సమయాల్లో గత రెండెల్లో వుహాన్ ప్రజలు చేసిన ప్రయాణాల ఆధారంగా ఈ వివరాలను అంచనా వేశారు.
వుహాన్లో ప్రయాణ ఆంక్షలు విధించిన కారణంగా చైనాలోని ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపించకుండా నిలువరించారని పరిశోధన పేర్కొంది. వుహాన్ ఆంక్షలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడం ద్వారా వైరస్ను నియంత్రించారని తెలిపింది.