చంద్రుడి ఆవలి భాగంలో పరిశోధనలు సాగిస్తోన్న చైనా చాంగే-4 ల్యాండర్, రోవర్లు తాజాగా తమ పనిని పునఃప్రారంభించాయి. ఆ ప్రాంతంలో 14 రోజులు పగటి సమయం ఆరంభం కావడం వల్ల అవి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చాయి. చాంగే-4 వ్యోమనౌక 2019 జనవరి 3న చంద్రుడి ఆవలి భాగంలోని దక్షిణ ధ్రువంలో దిగింది. అక్కడి అయిట్కెన్ బేసిన్లో పరిశోధనలు సాగిస్తోంది. 736 రోజుల పాటు దాని ప్రస్థానం కొనసాగింది.
ఆవలి భాగం ఎన్నడూ భూమి నుంచి కనిపించదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.13 గంటలకు ల్యాండర్ క్రియాశీలమైంది. ఉదయం 10.29 గంటలకు యుతు-2 రోవర్ పనిచేయడం ప్రారంభించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై వాయువ్య దిశగా పయనించనుంది. గ్రహశకలాల ఢీ వల్ల ఏర్పడ్డ బసాల్ట్ శిల ప్రాంతంలోకి వెళ్లనుంది. ఆ ప్రాంతాన్ని కెమెరాతో క్లిక్మనిపిస్తుంది. పరారుణ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, న్యూట్రల్ అటమ్ డిటెక్టర్, లూనార్ రాడార్ల సాయంతో శాస్త్రీయ పరిశోధనల సాగిస్తుంది. చంద్రుడిపై పగటి సమయం 14 రోజులు ఉంటుంది. అలాగే రాత్రివేళ అదే నిడిపిని కలిగి ఉంటుంది. ఈ లెక్కన చాంగే-4కు ఇది 26వ రోజు.