ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి మోకాలడ్డింది. అన్ని వర్గాలతో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే భద్రతా మండలిలో సంస్కరణలు ఉంటాయని తన కుటిల నీతిని ప్రదర్శించింది.
యూఎన్ఎస్సీలో ఐదు శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ బేషరతుగా భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలుపుతున్నాయి. అయితే.. చైనా మాత్రం ఏకాభిప్రాయ సాధన అంటూ కొంతకాలంగా సాకులు చెబుతోంది. ప్రస్తుతం.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్.. ఆగస్టులో మండలికి నాయకత్వం వహించనుంది. ఈ క్రమంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగులుతోంది చైనా.
పాక్ కూడా..
భద్రతా మండలిలో సంస్కరణలకు మద్దతు తెలుపుతున్నామన్న చైనా.. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు మండలిలో నిర్ణయాధికారం లభిస్తుందని పేర్కొంది. అయితే సాధ్యమైనంత వరకు అన్ని వర్గాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందంది. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. భారత్ సభ్యత్వానికి చైనాతో పాటు పాకిస్థాన్ కూడా వ్యతిరేకిస్తోంది.
ఇదీ చదవండి: 'యూఎన్ఎస్సీలో భారత శాశ్వత సభ్యత్వంపై చర్చించాలి'