న్యూజిలాండ్లోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన 'స్టఫ్' కేవలం ఒకే ఒక్క డాలర్కు ఆ సంస్థ కార్యనిర్వహణ అధికారిణికి అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. స్టఫ్ మీడియా సంస్థ ప్రతిరోజు చాలా దినపత్రికలను ముద్రిస్తుంది. అదే పేరుతో ప్రముఖ న్యూస్ వెబ్సైట్ను నడుపుతోంది. ఆ సంస్థలో 400మంది పాత్రికేయులతో కలిపి మొత్తం 900 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన 9 ఎంటర్టైన్మెంట్ అధీనంలోని స్టఫ్.. కరోనా మహమ్మారి చుట్టుముట్టక ముందు నుంచే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వల్ల ప్రకటనల ఆదాయం కూడా తగ్గిపోయింది.
ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్కు ఇచ్చిన ఓ ప్రకటనలో 9 ఎంటర్టైన్మెంట్ ఈ మేరకు స్టఫ్ అమ్మకంపై వివరాలు వెల్లడించింది.
"స్టఫ్ మీడియాను.. సంస్థ సీఈఓ సినాడ్ బౌచర్కు యాజమాన్య కొనుగోలు ఒప్పందంలో భాగంగా విక్రయిస్తున్నాం. ఒప్పందం ఈ నెల చివరివరకు పూర్తవుతుంది. స్థానిక యాజమాన్యం ఉండటం స్టఫ్కు ముఖ్యమని మేము ఎప్పుడూ నమ్ముతాం. ఇది పోటీలో ఉండేందుకు, వినియోగదారులకు చేరువయ్యేందుకు ఉత్తమమైన నిర్ణయం అనుకుంటున్నాం."
– హగ్ మార్క్స్, సీఈఓ, 9 ఎంటర్టైన్మెంట్.
ఈ అంశంలో స్టఫ్ సీఈఓ సినాడ్ బౌచర్ సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్య మార్పిడిపై కీలక విషయాలు వెల్లడించారు.
"ప్రస్తుతం ఉద్యోగులను తొలగించటం, వార్తాపత్రికను మూసివేయటం వంటి ప్రణాళికలు ఏమీ లేవు. యాజమాన్యం మారినంత మాత్రానా స్టఫ్ కానీ, ఇతర మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ తొలిగిపోవు. ఆన్లైన్ పాఠకుల నుంచి ఆదాయం పెంచాలనుకుంటున్నాం. స్టఫ్ గత నెల పాఠకులు విరాళం ఇచ్చేందుకు ఓ ఎంపికను ఏర్పాటు చేసింది. లిమిటెడ్ లయబిలిటి కంపెనీ ద్వారా స్టఫ్ను కొనుగోలు చేస్తున్నాం. ఇందులో ఉద్యోగులకే ప్రత్యక్ష వాటాను ఇవ్వటం ద్వారా యాజమాన్య మార్పిడి ప్రణాళికపై పని చేస్తున్నాం. ఈ ఒప్పందం ప్రత్యర్థి మీడియా ఎన్జడ్ఎంఈ.. స్టఫ్ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలకు ముగింపు పలుకుతుంది."
- సినాడ్ బౌచర్, స్టఫ్ సీఈఓ
న్యూజిలాండ్లోని చాలా మీడియా సంస్థలు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎన్జడ్ఎంఈ 200 ఉద్యోగాలు తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో స్టఫ్ వేతనాల్లో కోత విధించింది. గత నెల జర్మనీ సంస్థ బాయర్ మీడియా న్యూజిలాండ్లోని తన సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది. మ్యాగజైన్ల ప్రచురణలు ఆపేసింది.