ఇరాన్ అణు ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ దిశగా వచ్చేవారం మధ్యవర్తుల ద్వారా చర్చలను ప్రారంభిస్తామని అమెరికా, ఇరాన్ శుక్రవారం తెలిపాయి. దీంతో ఈ ఒప్పందంలోకి రెండు దేశాలనూ తిరిగి తెచ్చే దిశగా గణనీయ పురోగతి సాధించినట్లయింది. 2015లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాలకు కట్టిడి చేస్తే.. అమెరికా, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో అమెరికాతో పాటు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలు భాగస్వాములుగా ఉన్నాయి.
వైదొలిగిన అమెరికా
దాదాపు మూడేళ్ల కిందట నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, తిరిగి ఇరాన్పై ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన జో బైడెన్.. ఈ ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించటం తనకు ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. అయితే తొలుత ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెట్టింది. దీనిపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి వియన్నాలో పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
ఇదీ చదవండి : ఆ పోలీసు గౌరవార్థం అమెరికా జెండా అవనతం