అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజుల ముందు చైనాపై మరోమారు ఆంక్షల అస్త్రం సంధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాలోని షింజియాంగ్ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటా ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉయ్గర్కు చెందిన ఖైదీలు, బందీలను ఆయా ఉత్పత్తుల తయారీ కోసం బలవంతంగా వినియోగిస్తున్నారనే అభియోగాల మేరకు తాజా నిషేధం విధించినట్లు అగ్రరాజ్య కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం(సీబీపీ) తెలిపింది.
" చైనా షింజియాంగ్లోని స్వయంప్రతిపత్తి గల ప్రాంతం ఉయ్గర్ నుంచి వచ్చే కాటన్, టమాటా ఉత్పత్తులను సీబీపీ నిషేధించింది. ఈ ఆదేశాలు జనవరి 13 నుంచి అమెరికాలోని అన్ని నౌకాశ్రయాలకు వర్తిస్తాయి. బందీలుగా ఉన్న ఉయ్గర్ ప్రాంతీయులను వీటి తయారీ కోసం వినియోగిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. "
- కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం, అమెరికా
కాటన్, టమాటాలతో పాటు నిషేధం విధించిన ఉత్పత్తుల జాబితాలో దుస్తులు, టమాటా విత్తనాలు, టమాటా సాస్, వంటకు సిద్ధంగా ఉన్న టమాటాలు, టమాటాలతో చేసిన ఇతర వస్తువులు ఉన్నాయి.
అమెరికాలోకి తక్కువ ధరకే వస్తువులను ఎగుమతి చేసేందుకు చైనా వినియోగిస్తున్న బానిసత్వం, దోపిడీని తాము సహించమని తెలిపారు సీబీపీ యాక్టింగ్ కమిషనర్ మార్క్ ఏ మోర్గన్. మానవ విలువలను గౌరవించే అమెరికా వ్యాపారాలను అది బాధిస్తోందన్నారు. అమెరికా సరఫరా గొలుసులో బలవంతంగా కార్మికులను వినియోగించటాన్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సహించదని స్పష్టం చేశారు.
చైనాలో రాజకీయ పునరావాస విద్యా కేంద్రాలుగా చెబుతోన్న శిబిరాల్లో 10 లక్షల మందికిపైగా బందీలుగా ఉన్నట్లు సమాచారం. మైనారిటీ ప్రజలను సామూహిక ఖైదు చేసిన ఘటన ప్రపంచంలోనే ఇదే అతిపెద్దదని యావత్ ప్రపంచం చెబుతోంది.
ఇదీ చూడండి: చైనాను తిప్పికొట్టే శక్తి భారత్కే ఉంది: అమెరికా