అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను నిషేధించడం వల్ల సోషల్ మీడియా సంస్థల షేర్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించటం వల్ల ట్విట్టర్ షేర్లు సోమవారం 6.4 శాతం పడిపోయాయి. అటు ఫేస్బుక్ షేర్లు సైతం 4 శాతం తగ్గాయి. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్.. తన ట్వీట్ల ద్వారా మద్దతుదారులను రెచ్చగొట్టారన్న కారణంతో ఆయన వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్ ఖాతాలో ఆయనకు 89 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ ఈ నెల 20 వరకు ట్రంప్ ఖాతాను స్తంభింపజేసింది.
అయితే ట్విట్టర్ నిర్ణయానికి ట్రంప్.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'త్వరలో మనం కొత్త ఫ్లాట్ఫామ్ను రూపొందిద్దామని' అభిమానులను ఉద్దేశించి అన్నారు. ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థల షేర్లు సైతం సోమవారం తగ్గుముఖం పట్టాయి. యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్లు సోమవారం 2 శాతానికి పైగా తగ్గాయి. క్యాపిటల్ ఘటనకు సంబంధం ఉందన్న ఆరోపణల మధ్య పార్లర్ అనే యాప్ను గూగుల్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించాయి.
మరోవైపు సోషల్ మీడియా సంస్థల చర్యలను ట్రంప్ మద్దతుదారులు తప్పుబట్టారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లేనని అన్నారు.
ఇదీ చదవండి : ట్రంప్కు ఫేస్బుక్, ట్విట్టర్ వరుస షాకులు