అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. ట్రంప్ తలపై రివార్డు ప్రకటిస్తూ ఇరాన్ అధికారిక మీడియాలో వస్తున్న ప్రకటనలు వీటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీ అంత్యక్రియలను ప్రసారం చేస్తున్న సమయంలో ఇరాన్ అధికారిక టీవీ ఛానళ్లు ఓ ప్రకటన చేశాయి. అందులో ప్రతి పౌరుడు నుంచి ఒక్కో డాలర్ చొప్పున ట్రంప్ తలపై 80 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్లో 80 మిలియన్ల మంది పౌరులున్నారని ఒక్కో డాలర్ చొప్పున 80 మిలియన్ డాలర్లు సేకరించి ఆ మొత్తాన్ని ట్రంప్ను చంపిన వారికి రివార్డుగా ఇస్తామని ఇరాన్ టీవీ ఛానళ్లు ప్రకటించినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఢీ అంటే ఢీ
గత శుక్రవారం బాగ్దాద్లో అమెరికా చేపట్టిన ఓ డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ మృతిచెందగా.. ఆయన హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇందుకు ట్రంప్ కూడా గట్టిగానే బదులిచ్చారు. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే కనీవినీ ఎరుగని రీతిలో దాడులు తప్పవని హెచ్చరించారు.