భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'ప్రధాన సంస్కర్త' అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు, కుటుంబానికి అండగా ఉండేందుకు టీ అమ్మిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అని కొనియాడారు. భారత్ చైతన్యవంతంగా, సమర్థంగా ఎదిగిందని చెప్పడానికి పేదరికం నుంచి ప్రధానిగా ఎదిగిన మోదీ జీవితమే నిదర్శనమన్నారు.
'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పేరుతో ఒబామా పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. 2015లో టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ గురించిన ప్రస్తావనను కూడా ఒబామా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, మెరుగైన విద్య, బాలికలు-మహిళల సాధికారత వంటివాటిపై మోదీకి స్పష్టమైన లక్ష్యాలున్నాయని ఒబామా ప్రశంసించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పాటుపడుతున్నారన్నారు. మోదీ.. యోగాకు భక్తుడని అభివర్ణించారు. మోదీ అమెరికా పర్యటన సమయంలో తనతో కలిసి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారకాన్ని సందర్శించుకున్న సందర్భాన్ని ఒబామా ఈ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. కోట్లాది మంది భారతీయుల సమైక్యత ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని ఆయన గుర్తించారని ఒబామా పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గురించి కూడా ఒబామా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. రాహుల్ది ఆరాటమే గానీ.. స్పష్టత, ధైర్యం ఆయనలో కనిపించదన్నారు. ఈ పుస్తకాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక సమీక్షించింది. నవంబరు 17న ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది.
ఇదీ చూడండి: ఆ తపన రాహుల్లో లేదు: ఒబామా