ఉక్రెయిన్ అధ్యక్షుడితో సంభాషణ వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఉక్రెయిన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లభించాయి.
డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలను అమెరికా దౌత్యవేత్తల సందేశాలు బహిర్గతం చేశాయి. ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఐరోపాలోని అమెరికా దౌత్యవేత్తలు, ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడి గిలానీల మధ్య జరిగిన సందేశాలను శ్వేతసౌధ నిఘా విభాగం బహిర్గతం చేసింది.
వివరాలివీ..
జో బిడెన్ కుమారుడు గతంలో ఉక్రెయిన్లో వ్యాపారాలు చేశారు. వాటిపై అవినీతి ఆరోపణలు చేసి, దర్యాప్తు చేయించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఈ సందేశాలు వెల్లడించాయి. ఈ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు ట్రంప్ డిమాండ్గా పేర్కొన్నట్లు అభిశంసన తీర్మానంలో డెమొక్రాట్లు పేర్కొన్నారు.
మరోవైపు అంతకుముందు మూతపడిన కేసులను తిరిగి దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ న్యాయవాది ఒకరు వెల్లడించారు. ఉక్రెయిన్కు అమెరికా నిలిపివేసిన ఆర్థిక సాయం పునరుద్ధరించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఇదీ చూడండి: అభిశంసన తీర్మానం ఓ తెలివితక్కువ పని: ట్రంప్