చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచడంపై ప్రజాగ్రహం హింసగా మారింది. పలు నగరాల్లో వరుసగా రెండో రోజు ప్రజలు నిరసనలు చేపట్టారు. కొన్ని మెట్రో స్టేషన్లను ధ్వంసం చేశారు. భారీగా బస్సులను తగలబెట్టారు.
అత్యయిక స్థితి..
గంట గంటకూ ప్రజల్లో ఆందోళనల స్థాయి పెరిగిపోవడం.. విధ్వంసం జరుగుతున్నందున.. అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించడానికి కారణం శాంతి భద్రతల పరిరక్షణ అని.. ప్రజల భద్రతే ముఖ్యమని పినేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
15 రోజుల పాటు..
దేశంలో ఎమర్జెన్సీ ప్రాథమికంగా 15 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడానికి వీల్లేదు. గుమిగూడి ప్రదర్శనలు చేయడం కూడా నిషేధం. ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ వారాంతంలో జరగాల్సిన ఫుట్ బాల్ మ్యాచ్లను జాతీయ ఫుట్ బాల్ అసోసియేషన్ రద్దు చేసింది.
ఇదీ చూడండి: హాంకాంగ్ నిరసనలు... మాస్క్లతో మానవహారం