అమెరికా సైన్యానికి చెందిన రహస్య క్షిపణి టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడన్న కేసులో నిందితుడికి అమెరికా న్యాయస్థానం 38 నెలల జైలు శిక్ష విధించింది.
చైనాకు చెందిన ఉయ్సన్ అనే వ్యక్తి అమెరికాలోని టక్సన్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ అమెరికన్ ఆర్మీ కోసం రేథియాన్ క్షిపణులు, కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. విధుల్లో భాగంగా అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీని నేరుగా యాక్సెస్ చేసే అవకాశం ఉయ్సన్కు ఉంది. అయితే, ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం (ఏఈసీఏ), ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ (ఐటీఏఆర్) ప్రకారం తగిన అనుమతి లేనిదే సంబంధిత టెక్నాలజీ ఎవరికీ ఇవ్వకూడదు.
అయితే, ఉయ్సన్ తన వ్యక్తిగత పని మీద 2018 డిసెంబర్-2019 జనవరి మధ్య చైనా వెళ్లినపుడు టక్సన్ సంస్థ ఇచ్చిన ల్యాప్టాప్ను అక్కడకి తీసుకెళ్లాడని, ఆ సమయంలో రహస్యమైన టెక్నాలజీని ఆ దేశానికి చేరవేశాడని అమెరికాలో కేసు నమోదైంది. ఏఈసీఏ, ఐటీఏఆర్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాడని కూడా కేసులో పేర్కొన్నారు. అయితే తాను రహస్య టెక్నాలజీని చైనాకు ఇవ్వలేదని, సంస్థ ఇచ్చిన ల్యాప్టాప్ను దురుద్దేశంతో అక్కడికి తీసుకెళ్లలేదని విచారణ సమయంలో ఉయ్సన్ తెలిపారు.
"ఉయ్సన్ ఎంతో నైపుణ్యం గల ఇంజినీరు. అత్యంత సున్నితమైన ఈ టెక్నాలజీని చైనాకు బదలాయించడం నేరమని కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ అమెరికన్ ఆర్మీ రహస్య టెక్నాలజీని చైనాకు ఇచ్చేశారు"
- జాన్ సీ డిమెర్స్, సహాయ అటార్నీ జనరల్
కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంలో అమెరికా ప్రభుత్వం ప్రైవేటు కాంట్రాక్టర్లపై ఆధారపడుతోందని అటార్నీ జనరల్ మైఖేల్ బెయిలీ అన్నారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. రక్షణ సాంకేతికతను విదేశీ వ్యక్తులకు బహిర్గతం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. అలాంటి వారికోసం జైళ్లు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇది పొరపాటున ల్యాప్టాప్ తీసుకెళ్లడం కాదని, యూఎస్ క్షిపణి సాంకేతికతను విదేశాలకు ఎగుమతి చేయడమని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయ డైరెక్టర్ అలాన్ ఇ కోహ్లెర్ ఆరోపించారు. ఓ ఉద్యోగి ల్యాప్టాప్ను విదేశాలకు తీసుకెళ్తుంటే సంస్థ ఏం చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చూడండి: క్రిస్మస్కు ముందే ఫైజర్ టీకా పంపిణీ!