విదేశీ ఉద్యోగులకు తాత్కాలికంగా వీసాలు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టెక్ కంపెనీల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. టెక్ దిగ్గజాలు యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.
కొవిడ్-19 సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. ఈ వీసాల నిషేధం నిబంధనలు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి ఆయా కంపెనీలు.
దాదాపు 50 టెక్ కంపెనీలు ఈ వ్యాజ్యానికి మద్దతు ప్రకటించాయి.
విసాల నిషేధం ప్రకటన..
హెచ్-1బీ వీసా సహా తాత్కాలిక పని వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపేస్తూ ట్రంప్ ప్రభుత్వం జూన్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఈ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారిపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల్లో.. అమెరికా ఉద్యోగుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. యాపిల్ సీఈఓ టిమ్కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా టెక్ దిగ్గజాల అధినేతలు బహిరంగంగానే తప్పుబట్టారు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధి, టెక్ ప్రపంచంలో అగ్రస్థానంలో అమెరికా ఉందంటే.. అందుకు వలసదారుల కృషి ఎంతో ఉందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. అందుకే ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా, పని కోసం వలస వచ్చే వారికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.