యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాహీరో రామ్చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మంకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూనే ఉంది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర బాగుంది? ఎవరికి ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తారక్ను చరణ్ డామినేట్ చేశాడని కొంతమంది అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని ఇటీవలే ముంబయిలో జరిగిన సినిమా సక్సెస్మీట్లో బాలీవుడ్ మీడియా లేవనెత్తడం హాట్ టాపిక్గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండగా ఓ రిపోర్టర్ ఈ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగాడు. 'సినిమాలో రామ్చరణ్ బాగా ఎలివేట్ అయ్యారు. ఆయనకే ప్రశంసలు దక్కుతున్నాయి. దీనికి సమాధానం చెప్పండి' అని ప్రశ్నించారు. అయితే దీనిపై వెంటనే అక్కడే ఉన్న రామ్ చరణ్ కలగజేసుకొని అదిరిపోయే సమాధానం ఇచ్చి ఫ్యాన్స్ మనసులను దోచేశారు.
అయితే తాజాగా దీనిపై రాజమౌళి కూడా స్పందించారు. 'ఇద్దరు నటుల్లో ఒకరికే సినిమా విజయాన్ని ఆపాదించాలని ఆలోచన వస్తేనే నా హృదయం ముక్కలైపోతుంది. అయినా ఎన్టీఆర్ నటన సామర్థ్యం అందరికీ తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఇక రామ్చరణ్ విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'లో కొత్త రామ్చరణ్ను చూశారు. అప్పటివరకు ఉన్న తనలో దాచిన నటన సామర్థ్యాన్ని ఒక్కసారిగా బయటపెట్టాడు. దీంతో అందరికీ అతడు కొత్తగా కనిపించాడు. కానీ వారిద్దరూ తమ పాత్రల కోసం ఎంత కష్టపడ్డారో, పాత్రలో ఎంతగా లీనమైపోయారో ఓ దర్శకుడిగా నాకు తెలుసు. నిజానికి భీమ్ పాత్రలో ఇతర ఏ భారతీయ నటుడిని నేను ఊహించుకోలేను. ఎందుకంటే ఆ పాత్ర ఎన్నో వేరియేషన్స్తో కూడుకున్నది. దాన్ని ఎన్టీఆర్ ఒక్కడే చేయగలడు.' అని జక్కన్న తెలిపారు.
అంతకుముందు రామ్చరణ్కు ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు.. 'ఆ మాటను నేను ఏకీభవించను. ఒక్కక్షణం కూడా నేను దాన్ని నమ్మను. మేమిద్దరం చాలా బాగా నటించాం. ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. ఇప్పటివరకూ ఏ చిత్రానికి చేయనంత ఎంజాయ్మెంట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫీలయ్యాను. తారక్తో నా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశాన్ని కల్పించిన రాజమౌళికి థ్యాంక్స్' అని చాలా డిప్లమాటిక్గా బదులిచ్చారు.
ఇదీ చదవండి: సోనమ్ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు- ఆమె అత్త..!