బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ తన అభిమానులకు ఓ వాగ్దానం చేశారు. హీరోయిన్గా తన నట ప్రస్థానం మొదలై పదేళ్లు గడిచిన సందర్భంగా ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తన పదేళ్ల ప్రయాణంలో ప్రతి రోజును ఆనందంగా గడిపినట్టు తెలిపారు. 'ఇప్పటి వరకు నటించిన దానికంటే మెరుగ్గా నటిస్తా, మిమ్మల్ని అలరించేందుకు బాగా కష్టపడతా' అని ప్రామిస్ చేశారు. కాగా, అలియా భట్ పోస్ట్ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రముఖ దర్శక-నిర్మాత మహేశ్భట్ కుమార్తె అయిన అలియా 'సంఘర్ష్' అనే చిత్రంతో బాల నటిగా తెరంగేట్రం చేశారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో కథానాయికగా కెరీర్ ప్రారంభించారు. సిద్ధార్థ్ మల్హోత్ర, వరుణ్ ధావన్ హీరోలుగా కరణ్జోహార్ తెరకెక్కించిన ఆ చిత్రం 2012 అక్టోబరు 19న విడుదలైంది. తొలి సినిమాతోనే అలియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటి వరకు సుమారు 17 సినిమాల్లో హీరోయిన్గా, మరికొన్ని చిత్రాల్లో అతిథిగా కనిపించిన అలియా 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' సహా పలు అవార్డులు అందుకున్నారు. 2017లో 'ఫోర్బ్స్ 30 అండర్ 30' జాబితాలో నిలిచారు. 'ఉడ్తా పంజాబ్', 'రాజి', 'గంగూబాయి కాఠియావాడి' చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన అలియా 'ఆర్ఆర్ఆర్'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'బ్రహ్మాస్త్రం'తో ఇటీవల సందడి చేసిన ఆమె త్వరలోనే హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని' సినిమా చేస్తున్నారు.
ఇదీ చూడండి: హీరోయిన్స్గా మారిన ఈ అందాల యాంకర్స్ను చూశారా?