కరోనాతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కొన్ని ఔషధాలు అత్యవసరంగా మారాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు, వైద్య సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్లతో చేతులు కలిపి అతి చవకైన ఇంజక్షన్లను భారీ ధరకు విక్రయిస్తున్నారు.
రెమ్డెసివర్ ఇంజక్షన్ అసలు ధర రూ.3500 మాత్రమే..
రెమ్డెసివిర్, టోసిలిజ్ మాబ్ లాంటి ఇంజక్షన్లకు విపణిలో ఎంతో డిమాండ్ ఉంది. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇంజక్షన్లను కొనడానికి రోగుల బంధువులు ధరకు వెనకాడటం లేదు. వాస్తవానికి రెమ్డెసివిర్ ఇంజక్షన్ ధర రూ.3,500... కానీ కొంత మంది రూ.20 వేల నుంచి 40 వేల వరకు విక్రయిస్తున్నారు.
ఇద్దరు వైద్యులు అరెస్ట్..
కరోనా తర్వాత ప్రస్తుతం బ్లాక్ఫంగస్ భయపెడుతోంది. యాంటీ వైరస్ ఇంజక్షన్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. బ్లాక్ ఫంగస్ రోగులకు ఉపయోగించే ఆంపోటెరిసిన్-బీ ఇంజక్షన్ ధర కంపెనీలను బట్టి 350 రూపాయల లోపే ఉంటుంది. కానీ దీన్ని బ్లాక్ మార్కెట్లో 50 వేలకు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 5 ఇంజక్షన్లు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన ఐదుగురిలో ఇద్దరు వైద్యులు ఉండటం గమనార్హం. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన మరో వైద్యుడు పరారీలో ఉన్నాడు.
నియోకేర్ వైద్యుడే ప్రధాన సూత్రధారి!
నియో కేర్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న చెల్లగొళ్ల రవితేజ చౌదరి... బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల అక్రమ విక్రయాలకు పథకం పన్నాడు. అతనికి పరిచయం ఉన్న వైద్యులు, మెడికల్ రిప్రజెంటేటివ్లతో చేతులు కలిపాడు. బ్లాక్ ఫంగస్ రోగులను సంప్రదించి అధిక ధరకు ఇంజక్షన్లు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ముఠా సభ్యులెవరంటే..
ఇందులో భాగంగా మలక్పేట్ యశోద ఆస్పత్రిలో పనిచేసే బచ్చు రాంచరణ్, రెడ్డి ల్యాబ్స్లో పనిచేసే గాలి సాయినాథ్, మల్లారెడ్డి ఆస్పత్రిలో ఎక్స్రే మిషన్ ఆపరేటర్ సురేష్.. బాలాజీ డయోగ్నస్టిక్స్లో ల్యాబ్ టెక్నీషియన్ సాయివర్దన్, మెదక్కు చెందిన శ్రీకాంత్.. ముఠాగా ఏర్పడ్డారు.
ప్రధాన నిందితుడు చెల్లగొళ్ల రవితేజ 5 ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను 350 రూపాయలు పెట్టి ఖరీదు చేశాడు. ఒక్కో ఇంజక్షన్ను 50 వేలకు ఓ వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా... హైదరాబాద్ అత్తాపూర్ వెళ్లే దారిలో ఐదుగురు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రవితేజ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా ఇప్పటివరకు ఎన్ని రకాల ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించారు అనేదానిపై లంగర్ హౌజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠాలో కార్పొరేట్ ఆస్పత్రులకు చెందన వారెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్