ఏపీలోని కర్నూలు సమీపంలోని నిడ్జూరు గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయులు మధ్య వివాదం తలెత్తింది. ఇంటి ముందు కాలువ సమస్యతో ప్రారంభమైన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. అయితే వైకాపా శ్రేణులే ఈ ఘటనకు కారణమని తెదేపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మృతుడు శ్రీనివాసులు కుటుంబం నుంచి తెదేపా తరుపున పోటీ చేశారు. ఈ కారణంగానే వైకాపా కార్యకర్తలు కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్నినిడ్జూరు వైకాపా నేత సత్యంరెడ్డి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. పోలీసులు.. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్: నారసింహుని క్షేత్రంలో తగ్గిన రద్దీ