మేనత్త, వదిన వేధింపులు తట్టుకోలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మార్కాపూర్కు చెందిన రాథోడ్ అరవింద్కు గత కొన్నేళ్ల కిందట మేనత్త కూతురు మంజులతో వివాహమైంది. అరవింద్ తల్లిదండ్రులు లేకపోవడంతో తన చెల్లెలు శ్రీదేవి (21) సైతం వారితోనే ఉండేది.
బతుకుదెరువు కోసం మృతురాలి అన్న ముంబయి వెళ్లాడు. ఈ క్రమంలో మేనత్త, తన వదిన రోజు సూటి పోటి మాటలతో వేధిస్తున్నారని... ముంబయి నుంచి ఇంటికి వచ్చిన తన అన్నకు చెప్పుకుంది. వేధింపులు ఎక్కువ కావడంతో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లెలి మృతికి కారకులైన తన భార్య, మేనత్తపై చర్యలు తీసుకోవాలని మృతురాలి అన్న ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!