ఒంటరిగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు, 18 వందల రూపాయల నగదు, దోపిడీలకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్, ఇంద్ర నగర్ కాలనీల్లో నివాసం ఉన్న పది మంది యువకులు పగటి పూట స్విగ్గీ, జొమాటోలలో డెలివరీ బాయ్లుగా పనిచేస్తూ... రాత్రి కాగానే ముఠాలుగా ఏర్పడి ఒంటరిగా కనిపించిన వ్యక్తులపై దాడులకు దిగుతారని కూకట్పల్లి ఎస్పీ సురేంద్ర రావు తెలిపారు. బాధితులు నిస్సహాయ స్థితికి చేరుకోగానే వారి వద్ద ఉన్న డబ్బు, నగలు, వాహనాలు, ఫోన్లను దోచేస్తారన్నారు. వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయగా వచ్చిన డబ్బులతో అందరూ కలిసి జల్సాలు చేస్తారని వివరించారు.
ఎనిమిది నెలల కాలంగా బాచుపల్లి , జగద్గిరిగుట్ట, బొల్లారం, బంజారా హిల్స్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధుల్లో వీరు దోపీడీలకు పాల్పడ్డారని ఎస్పీ సురేంద్ర రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాచుపల్లి కూడలిలో తనిఖీలు చేస్తుండగా... దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు పట్టుబడ్డారని వివరించారు. వీరిని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చిందన్నారు. వీరిని ఈరోజు రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. మిగిలిన నలుగురు సభ్యులను కూడా వెంటనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సీఐ నరసింహారెడ్డి, ఎస్ఐ రాజు యాదవ్, క్రైమ్ టీంలకు రివార్డులు అందజేస్తామని ఎస్పీ సురేంద్ర రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత