అక్రమంగా రవాణా చేస్తున్న 10 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్ను కరీంనగర్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శివారులోని కంకణాల సేనారెడ్డి క్రషర్ వద్ద కరీంనగర్ టాస్క్ఫోర్స్, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాల సంచులను, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
వీటిని తరలిస్తున్న పట్టణానికి చెందిన జున్నోజు రాజేందర్, జున్నోజు అఖిల్, పెరుమాండ్ల దేవేందర్, బైరి మల్లారెడ్డి అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ సృజన్రెడ్డి తెలిపారు. వీరు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన సానబోయిన కుమారస్వామి వద్ద కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
కఠిన చర్యలు తప్పవు:
ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను కొనుగోలు చేయటం, విక్రయించటం, ఉపయోగించటం, రవాణా చేయటం నేరమని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి. కమలాసన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాపారాలు చేసే వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
ఇదీ చూడండి. TS NEWS: శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్