Constructions of Illegal Villas in Dundigal: మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమ విల్లాల విక్రయంపై పోలీసులు నోటీసులు పంపారు. శ్రీలక్ష్మి శ్రీనివాస్ కనస్ట్రక్షన్ కంపెనీ పేరుతో బిల్డర్ విజయలక్ష్మి అక్రమంగా 260 విల్లాలు నిర్మించి విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలతో దుండిగల్ పోలీసులు నోటీసులిచ్చారు. ప్రస్తుతం బిల్డర్ అమెరికాలో ఉండగా.. వారంలోగా విచారణకు హాజరుకావాలని తెలిపారు. బఫర్ జోన్లో విల్లాలు నిర్మించినందుకు గతంలోనూ ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఒక కేసు, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో మరో కేసు తాజాగా నమోదు చేశారు. మరోవైపు వారం క్రితం చీటింగ్ కేసు కూడా పెట్టారు.
ఏం జరిగిందంటే..
2018 సంవత్సరానికి ముందు మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. 2018-19లో దుండిగల్ పురపాలక సంఘం ఏర్పడగా అందులో భాగమైంది. ఆ సమయంలో మల్లంపేటలో శ్రీలక్ష్మి శ్రీనివాస్ కనస్ట్రక్షన్ కంపెనీ పేరుతో బిల్డర్ విజయలక్ష్మి 15 ఎకరాల్లో విల్లాల నిర్మాణం మొదలుపెట్టింది. 65 విల్లాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని.. అక్రమంగా మరో 260 కట్టారు. కత్వ చెరువు ఎఫ్టీఎల్లో రోడ్లు, బఫర్ జోన్లో కొన్ని విల్లాలు నిర్మించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. సాగునీటి శాఖ ఈఈ విచారణ చేపట్టి, దుండిగల్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విల్లాల విక్రయంపై విజయలక్ష్మికి పోలీసులు నోటీసులు పంపారు.