Local Leaders are Occupying Empty Spaces: వరంగల్ నగరంలో అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జాలకు కాలు దువ్వుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ కాలనీలో కార్పొరేటర్ విశ్వనాధ్ 50 అడుగుల రహదారికి అడ్డంగా భవనం నిర్మించాడు. కాలనీవాసులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కేటీఆర్ ఆ భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చేసేదిలేక కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన దాన్ని కూల్చేశారు. అయినా తీరు మార్చుకోని ఆ కార్పొరేటర్ మరోసారి రహదారికి అడ్డంగా నిర్మాణం చేపట్టాడు. అంతటితో ఆగకుండా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మట్టికోటకు సమీపంలోని కుంటను చదును చేసి ప్లాట్లుగా మార్చాడు.
Land Grabs With Support of Ruling Party Leaders: ఇక మరో కార్పొరేటర్ భర్త ఏకంగా చెరువును కబ్జా చేసేందుకు యత్నించగా.. చెరువులు, కుంటల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వార్త వైరల్ కావడంతో వెనక్కి తగ్గాడు. ఇంకో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఏకంగా రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. ఇతనికి హనుమకొండకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకుని అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది.
హనుమకొండలో గతంలో భూ తగాదాల కారణంగా ఓ కార్పొరేటర్ హత్యకు గురైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కబ్జా రాయుళ్ల నుంచి భూములకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు రావడంతో రహస్యంగా విచారణ జరిపించి, నేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలోనూ దేశాయిపేటకు చెందిన ఓ కార్పొరేటర్ పార్కు స్థలం కాజేసేందుకు యత్నించగా, అప్పటి కమిషనర్ అడ్డుకట్ట వేశారు.
మరో కార్పొరేటర్ దేవాలయాన్ని అడ్డుపెట్టుకొని పార్కు స్థలాన్ని కాజేయాలని చూడగా కమిషనర్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన ఆలయానికి ప్రహరీ గోడ నిర్మించారు. గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ నేతలతో కలిసి, ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం భూకబ్జాలకు పాల్పడటంపై పోలీసులు రహస్యంగా విచారణను జరిపారు. ఈ మేరకు 62వ డివిజన్ కార్పొరేటర్ రవీందర్పై మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. భూకబ్జాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పోలీసులు సీరియస్గా పరిగణిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి, వాస్తవ పరిస్థితిని గుర్తించి, కబ్జాకోరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: