కూలీ పని చూపిస్తానని వెంట తీసుకెళ్లి ఓ మహిళను హత్య చేసిన వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన వెంకటేశ్... గోల్కొండలో గుంపు మేస్త్రిగా పనిచేస్తున్నాడు. మణికొండ కూలీల అడ్డా దగ్గర ఉండే కూలీలను తీసుకెళ్లి ఇంటి నిర్మాణ పనులు చేయిస్తుంటాడు.
ఈనెల 9న చెన్నమ్మ అనే మహిళను కూలీ పేరుతో వెంట తీసుకెళ్లాడు. రాయదుర్గంలోని కల్లు కంపౌండ్లో కల్లు తీసుకొని షేక్పేటలోని నిర్మానూష్య ప్రాంతానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. కల్లు సేవించిన అనంతరం మత్తులో ఉన్న చెన్నమ్మ తలపై వెంకటేశ్ రాయితో మోదాడు. చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత ఆమె కాళ్లకు ఉన్న కడియాలు, చెవి కమ్మలను తీసుకెళ్లాడు.
చెన్నమ్మ రాత్రి అయినా ఇంటికి రాకపోవడం వల్ల ఆమె భర్త ఆంజనేయులు గోల్కోండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్తో కలిసి కూలీకి వెళ్లిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిర్మానూష్య ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..