హైదరాబాద్లో కలకలం రేపిన మూడేళ్ల బాలుడి అపహరణ కేసును అబిడ్స్ పోలీసులు ఛేదించారు. బాలుడిని అపహరించిన శ్యామ్ బీంరావు సోలంకిని అరెస్టు చేశారు. అపహరణకు గురైన బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాటంతో ఆ కన్నవారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శివకుమార్ అతని భార్య అంబిక లాక్డౌన్కు ముందు నగరంలోనే ఉంటూ హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగించే వారు.
ఫుట్పాత్లపైనే జీవనం
లాక్డౌన్ కారణంగా వారు తమ ముగ్గురు పిల్లలతో కలిసి స్వస్థలానికి వెళ్లిపోయారు. పరిస్థితులు మారటంతో శివకుమార్ తన కుటుంబంతో కలిసి ఈనెల 4న హైదరాబాద్ చేరుకున్నాడు. అతను కుటుబంతో ఫుట్పాత్లపైనే నివసించే వాడు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఉంటున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బోగిరామ్, శ్యామ్బీం రావు సోలంకి వారికి పరిచయమయ్యారు. శివకుమార్ ముంబాయిలోని హోటల్లో పని ఇప్పిస్తామంటూ నమ్మించి... వారితో చనువుగా మెలిగారు.
చరవాణి, డబ్బులు ఎత్తుకెళ్లారు
నాంపల్లి రైల్వే స్టేషన్లో శివకుమార్ కుటుంబం నిద్రించిన సమయంలో వారి చరవాణి, మూడు వేల రూపాయలు చోరీ అయ్యాయి. దీంతో బాధిత కుటుంబం తమ మకాం గాంధీభవన్ మెట్రో స్టేషన్ సమీపంలోకి మార్చింది. మహారాష్ట్ర వాసులు కూడా వారితో పాటే అక్కడకు చేరుకున్నారు. శివకుమార్ అతని భార్య పని వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో శ్యాంబీంరావు సోలంకి ఇదే అదునుగా భావించి... శివకుమార్ మూడు సంవత్సరాల కుమారుడు రుద్రమణిని అపహరించి అక్కడ నుంచి పరారయ్యాడు.
దర్యాప్తులో ఇబ్బంది
తిరిగొచ్చిన దంపతులకు కుమారుడు కనిపించకపోవటంతో పరిసర ప్రాంతాల్లో వెదికారు. ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సోలంకి బాలుడిని అపహరించినట్లు నిర్ధరణకు వచ్చారు. అయితే కిడ్నాపర్ గురించి ఎటువంటి వివరాలు పోలీసులకు లభించలేదు. అతను చరవాణి కూడా వాడకపోవటంతో దర్యాప్తు కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు సీసీ కెమెరాల దృశ్యాలు విశ్లేషించారు.
మహారాష్ట్రకు వెళ్లినట్లు నిర్ధరణ
కిడ్నాపర్ బాలుడిని అపహరించి వెళ్లిన మార్గంలో సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు, 900 సీసీ కెమారాల దృశ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించగా... మహారాష్ట్రలోని వాషిం జిల్లా మాలేగావ్ అమన్వాడి గ్రామానికి నిందితుడు చేరుకున్నట్లు తేలింది. పోలీసులకు మహారాష్ట్ర, రైల్వే పోలీసులు దర్యాప్తులో సహకరించారు. నిందితుడు ఉన్న ఇంటిని చుట్టు ముట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బాలుడిని రక్షించారు. అపహరణ కేసును ఛేదించి బాలుడిని కాపాడిన పోలీసు సిబ్బందిని కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. వారికి నగదు పురస్కారం అందజేశారు.
ఇదీ చదవండి: జూబ్లీహిల్స్లోని బేకరీలో భారీ దొంగతనం.. రూ.9 లక్షలు చోరీ