ఏపీ గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం అర్ధరాత్రి అదృశ్యమైన నాలుగు రోజుల పసికందు (GGH missing boy found) ఆచూకీ లభ్యమైంది. వార్డుబాయ్ హేమ వరుణుడు శిశువును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరో మహిళతో కలిసి.. నిందితుడు శిశువును ఎత్తుకెళ్లాడని పోలీసులు చెప్పారు. నిందితుడు గుంటూరు నెహ్రూ నగర్ సమీపంలో శిశువును దాచిపెట్టాడు. గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనుమానమే నిజమైంది..
పెదకాకానికి చెందిన ప్రియాంక, మహేశ్ దంపతులకు మగ పిల్లాడు జన్మించాడు. ఉక్కపోతగా ఉందని శిశువును తల్లి నుంచి తీసుకెళ్లిన అమ్మమ్మ, నాయనమ్మ వరండాలో పడుకోబెట్టారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే శిశువు అదృశ్యమయ్యాడు. శిశువు తల్లిదండ్రులు ప్రియాంక, మహేశ్ ఫిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శిశువు అదృశ్యంపై సమాచారమందుకున్న కొత్తపేట పోలీసులు..ఆస్పత్రికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. సంచితో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్న ఓ వ్యక్తి, మరో మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి అన్వేషణ కొనసాగించారు. సీసీ టీవీ పుటేజీలను సైతం పరిశీలించారు. పోలీసులకు అందిన కీలకమైన సమాచారంతో నెహ్రూనగర్కు చెందిన హేమవరణుడు అనే జీజీహెచ్ పాత వార్డు బాయ్తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్ కథ బయటపడింది. బాబు ఆచూకీ లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఓ ముఠా అరెస్ట్..