కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో 75 రోజుల క్రితం మరణించిన మహిళ మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతిపై ఆమె కూతురు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లి గుండెపోటుతో మృతి చెందలేదని, అస్తికోసం హత్య చేసి ఉంటారని జిల్లా ఎస్పీని ఆశ్రయించగా.. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నజీమా బేగం భర్త చనిపోవడంతో కూతురు అస్మాబేగం వద్ద జిల్లాకేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో నివాసముంటోంది.
ఇటీవలే కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్గా అస్మాబేగం పని చేస్తోంది. ఆమె ఆస్పత్రికి వెళ్లిన సమయంలో తల్లి నజీమా బేగం మృతి చెందింది. గుండెపోటుతో మీ అమ్మ చనిపోయిందని మేనమామ షఫీ, ఆమె భర్త వెంకటస్వామి అస్మాకు తెలిపారు. నిజమేనని నమ్మిన అస్మా స్వగ్రామంలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే కొద్దిరోజులుగా భర్త వెంకటస్వామి, మేనమామ షఫీల ప్రవర్తన వింతగా ఉండటంతో అస్మాకు అనుమానం వచ్చింది. నజీమా బేగం తల్లి పేరున ఉన్న రూ.20 లక్షల విలువ చేసే ఆస్తిలో వాటా అడుగుతుందేమోనని భర్త వెంకటస్వామితో కలిసి మేనేమామ షఫీ హత్య చేసి ఉంటారని అస్మా అనుమానం వ్యక్తం చేస్తూ.. జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో ఈరోజు పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.