ఉద్యోగం పేరుతో ఓ యువతి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.7.45 లక్షలు కాజేశారు. హైదరాబాద్ బోరబండకు చెందిన యువతి కొద్దిరోజుల క్రితం ఉద్యోగం కోసం షైన్ డాట్ కామ్ జాబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. అనంతరం రాహుల్ జైన్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. మీరు కస్టమర్ కేర్లో ఉద్యోగానికి ఎంపికయ్యారని తెలిపారు. ఆ ఉద్యోగం మీకే రావాలంటే ప్రాసెసింగ్ ఛార్జీలు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని అతను తెలిపాడు.
ఇది నిజమని నమ్మి యువతి మొదట లక్ష రూపాయలు అతను తెలిపిన ఖాతాకు నగదు బదిలీ చేసింది. తర్వాత వివిధ ఫీజుల పేరుతో మొత్తం రూ. 7.45 లక్షలు నేరగాళ్లు వసూలు చేశారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మోసపోయానని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ACB RIDES: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన డీఎఫ్వో