నిఘా సంస్థల అధికారుల ఎత్తులకు అక్రమార్కులు పైఎత్తులు వేస్తూ.. స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల నుంచి మాదక ద్రవ్యాలు, గల్ఫ్ దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం క్రమంగా పెరుగుతోంది. అది కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్రమార్కులు ఎంచుకుంటుండడంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్-డీఆర్ఐ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ తదితర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను, వారి లగేజిని నిశితంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ... అక్రమార్కుల స్మగ్లింగ్ ఆగడం లేదు.
సుమారు 97.5 కోట్ల విలువ చేసే హెరాయిన్..
ఈ నెల 5, 6 తేదీల్లో జోహన్స్బర్గ్ నుంచి దోహ మీదుగా హైదరాబాద్ వచ్చిన జింబాబ్వేకి చెందిన ఇద్దరు మహిళా ప్రయాణికులను పక్కా సమాచారంపై డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి 78 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల హెరాయిన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళా ప్రయాణికులిద్దరిని విచారించి కొరియర్లుగా డీఆర్ఐ నిర్దారించింది. ఆ కేసు అలా ఉండగానే జోహన్స్ బర్గ్ నుంచి దోహ మీదుగా వచ్చిన టాంజానియాకు చెందిన జాన్ విలియమ్స్ను పక్కా సమాచారంతో సోమవారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని, లగేజిని తనిఖీ చేయగా... 19.5 కోట్లు విలువ చేసే మూడు కిలోల హెరాయిన్ దొరికింది. ఈ రెండు కేసులు కూడా 15 రోజుల వ్యవధిలో నమోదవ్వడంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
విదేశీయులైతే పాస్పోర్టు, దేశీయులైతే ఆధార్ కార్డు..
బయట దేశాల నుంచి బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేసే ప్రయాణికుడు డొమెస్టిక్ ప్రయాణికుల సాయంతో సొత్తును దక్కించుకుంటున్నారు. ఇన్ఫార్మర్ల నుంచి పక్కా సమాచారం ఉంటేతప్ప అక్రమార్కులు నిఘా సంస్థలకు పట్టుబడడం లేదు. ఇన్ఫార్మర్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవడంతోపాటు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉండే హోటళ్లలో బస చేసే విదేశీయుల నుంచి పాస్పోర్టు, దేశీయులకైతే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తీసుకోవడం తప్పనిసరి చేశారు. అదే విధంగా ప్రతి రోజు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: KCR: నేడు వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్