మహిళల మెడలో నుంచి బంగారు వస్తువులను దొంగతనం చేస్తూ జల్సాలు చేస్తున్న ముఠాను చాకచక్యంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని హబ్సీగూడ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. స్థానికంగా నివసించే కాల్వ గంగా ప్రసాద్, వీర భక్తిని మహేష్, దౌల్తాబాద్కు చెందిన ప్రవీణ్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురూ కలిసి ముఠాగా ఏర్పడి గత నెలలో పొలంలో పనిచేసుకుంటున్న మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీవీఎస్ జూపిటర్, ఇటీవల చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో మరో మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు.
నగలను అమ్మడానికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను దుబ్బాక బస్టాండ్లో పట్టుకుని వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి సహకరించిన ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీపీ రామేశ్వర్ అభినందించారు. సమాజంలో యువకులు చెడు మార్గంలో ప్రయాణించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు.
ఇదీ చదవండి: 320 కిలోల గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్