మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారులో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.13 లక్షల విలువ చేసే 3,238 ప్యాకెట్ల నకిలీ మిరప విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు.
మహబూబాబాద్ గ్రామీణ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లిలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారులో సోదా చేయగా.. కారులో ముగ్గురు వ్యక్తులతోపాటు… దీప్తి-1600, భూమిక-1000, పలనాడు-25, సిరి-10, రాజేశ్వరి-300, పద్మావతి-271, అల్ట్రా వెరైటీ-32 ప్యాకెట్ల మిరప విత్తనాలు లభించాయి.
ఆ ప్యాకెట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోని ఈదులపూసపల్లికి తరలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పి.డి యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ నకిలీ విత్తనాలు పట్టుకునేందుకు కృషి చేసిన వ్యవసాయశాఖ అధికారి తిరుపతిరెడ్డి, రూరల్ సి.ఐ.రవికుమార్, ఎస్.ఐ రమేశ్ బాబులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నీట మునిగి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి