మున్నాభాయ్ అలియాస్ అబ్ధుల్ సమద్ … ది హైవే కిల్లర్. కరుడుగట్టిన హంతకుడు. కోడిని చంపినంత తేలిగ్గా మనుషుల పీకలు తెగ్గోస్తాడు. శవాల్ని గోనెసంచుల్లో కట్టి దగ్గర్లోని కాల్వల వద్ద పూడ్చేస్తాడు. ఈ పని చేసినందుకు అసలు పశ్చాత్తాప పడడు. ఒక దారుణ హత్య..తరువాత వంతు ఎవరిదని ఎదురు చూస్తూంటాడు. ఇలాంటి కిరాతక పనుల కోసం 16 మందితో అతనో ప్రత్యేక ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా మీదుగా వేళ్లే లారీలు ఈ ముఠా టార్గెట్. పోలీసు దుస్తులు వేసుకుని ట్రక్లు ఆపడం డ్రైవర్లు, క్లీనర్లను కిడ్నాప్ చేయడం పీకలు తెగ్గోయడం వీరి నేర విధానం. హత్యాకాండ తర్వాత లారీలోడ్ను అమ్మేయడం, వచ్చిన సొమ్మును జల్సా చేయడం.. అది ఖర్చవగానే మరో నేరానికి బయల్దేరడం ఈ ముఠా స్టయిల్. చెన్నై -కోల్కతా ప్రధాన రహదారి అడ్డాగా సాగిన మున్నాభాయ్ గ్యాంగ్ దారుణ హత్యాకాండ 2008లో వెలుగు చూస్తే 2021 మే 24 న కోర్టు తీర్పుతో ముగింపు దశకు చేరింది.
ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఏం జరిగిందంటే..
కోల్కతా-చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారిలో 2008లో కొన్ని లారీలు, వాటిలో ఉన్న సరకు అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో అప్పటి ట్రైనీ డీఎస్పీగా పనిచేసిన దామోదర్కు ఓ క్లూ లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటనలు వెలుగు చూశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా ఒక గ్యాంగ్ను తయారు చేసుకున్నాడు. అంతకు ముందు గుప్తనిధులు ఆచూకీ చెబుతానని కొంతమంది ధనవంతులను నమ్మించి, వారి వద్దనుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. దీనివల్ల ప్రయోజనం లేదని దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించాడు.
అధికారినంటూ చెకింగ్
జాతీయ రహదారిపై అధికారిలా కాపు కాసి, లోడులతో ఉన్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరటం అదును చూసి మెడలో నైలాన్ తాడు వేసి బిగించి హతమార్చడం చేసేవాడు అబ్దుల్. మృతదేహాలను గోతాల్లో కుక్కి, తోటల్లో, అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని, సరకును మాయం చేసేది అతడి గ్యాంగ్. మద్దిపాడులో ఓ పాడుపడ్డ గోడౌన్ను అద్దెకు తీసుకొని అక్కడ లారీని తుక్కుగా మార్చి, సరకును విక్రయించి సొమ్ము చేసుకునేవారు.
13 మందిని చంపేశారు
ఈ రహదారిలో దాదాపు 13 మందిని హత్య చేశారు. ట్రైనీ డీఎస్పీ దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. మున్నాను, అతని అనుచరులను అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు మున్నాకు బెయిల్ రావడంతో బెంగుళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మున్నా, అతని గ్యాంగ్ మీద ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి.. ఒంగోలు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో గతంలో వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా అబ్దుల్ గ్యాంగ్పై కేసులకు సంబంధించి నేరాలు రుజువు కావడంతో దోషులుగా నిర్ధరించారు.
ఈ కేసులపై ఇవాళ ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 12 మందికి ఉరి, మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మెుత్తం ఈ గ్యాంగ్పై ఏడు కేసులున్నాయి. ఇందులో మూడింటికి ఇప్పుడు శిక్ష ఖరారు చేశారు. మరో నాలుగు కేసులపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపై కేసు నమోదు