రైతుల సమస్యలు తెలుసుకుని... చట్టసభల్లో చర్చించేందుకే పొలంబాట కార్యక్రమం చేపట్టామని సీఎల్పీనేత భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ చేపట్టిన రైతులతో ముఖాముఖి, పొలంబాట- పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ నివాసంలో సమావేశమయ్యారు. పొలంబాట యాత్రతో నిజాలు బయటపడతాయని భయపడుతున్న సీఎం కేసీఆర్... హాలియా సభలో అనవసరమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ రూపొందించిన ప్రాజెక్టులన్నింటినీ రీ-డిజైనింగ్ పేరుతో తెరాస సర్కారు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతు శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పోరాడుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ రైతుల వైపు ఉంటారా... కేంద్రం వైపు ఉంటారా... ఇప్పటికైనా స్పష్టం చేయాలని... భట్టి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ పతనం సాగర్ ఉపఎన్నికతోనే మొదలవుతుందని భట్టి హెచ్చరించారు.